యావత్ తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. గోదావరి జలాలతో రాష్ట్రాన్ని కోటి ఎకరాల మగాణిగా మార్చి, తాగునీరిచ్చి గొంతు తడిపే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు మేడిగడ్డ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిపూజ చేశారు. అంతకుముందు బ్యారేజ్ చెంత నిర్మించిన యాగశాల లో సీఎం జల సంకల్ప యాగం, గోదావరి తల్లికి పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. 85 గేట్లతో అత్యంత పటిష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ ను నిర్మించారు. అనంతరం ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్ తోపాటు ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్,జగన్, కేసీఆర్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.
రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు...తెలంగాణలోని 13 జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేయనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసిన ఘనత కూడా తెలంగాణకే దక్కింది.
ఇదీ కాళేశ్వరం ఘనత...
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలం, ఇంజనీర్ల మేధస్సు, అధికారులు, సిబ్బంది కృషి, కార్మికుల శ్రమ... ఫలితంగా స్వల్ప కాలం లోనే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకొంది. రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తూ....మహోజ్వల జలదృశ్యం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టిన నాటి నుంచి నిర్మాణ పనుల్లో వినియోగించే సిమెంటు, కాంక్రీటు, ఇసుక, స్టీలు, భారీ యంత్రాలు, కార్మికులు, ఇలా అన్నింటి వినియోగంలోనూ ప్రపంచ రికార్డులు నమోదు చేసి అద్భుతాలు సృష్టించారు.
రికార్టుల మోత
రైతన్నలకు సాగునీటి కష్టాలు లేకుండా, పట్టణ, గ్రామీణ ప్రజానీకానికి తాగునీటి సమస్య రాకుండా, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించనున్న ప్రాజెక్టుగా కాళేశ్వరం ఎత్తిపోతలను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ఆద్యంతం రికార్డుల మయంగానే చెప్పాలి. గత ఏడాది డిసెంబర్ 22 ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్(రెయిన్ ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్) పనులను విజయవంతంగా చేసి తమకు తామే సాటని ఇంజనీర్లు అధికారులు, కార్మికులు చాటుకున్నారు.