హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి టౌన్ షిప్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో పోలీసులు సినీ నటుడు రాజ్ తరుణ్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. గురువారం రాత్రి రాజ్ తరుణ్ నుంచి వాంగ్మూలం సేకరించిన పోలీసులు... రెండు రోజుల్లో అభియోగపత్రాన్ని దాఖలు చేయనున్నారు.
నోటీసులు జారీ:
ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేశారు. అదుపు తప్పి వాహనం గోడను ఢీకొట్టిందని.. తనకు ఎలాంటి గాయాలు కాలేదని రాజ్ తరుణ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సీట్ బెల్టు పెట్టుకోవడం వల్లే ప్రాణాలతో బయటపడినట్లు స్పష్టం చేశారు.
ఇప్పుడు చెప్పలేం:
ప్రమాదం జరిగిన వెంటనే తనిఖీ చేసి ఉంటే రాజ్ తరుణ్ తాగి ఉన్నాడా లేదా అనే విషయం తెలిసి ఉండేదని... ఇప్పటికే మూడు రోజులు గడిచిపోవడం వల్ల ఆ విషయం తెలుసుకునే అవకాశం లేదని నార్సింగి సీఐ రమణ తెలిపారు.
మరో మలుపు:
ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్ పారిపోయే దృశ్యాలను కార్తీక్ అనే వ్యక్తి చిత్రీకరించాడు. దృశ్యాలను తొలగించాలంటూ తనకు 5లక్షల ఇస్తామని ఆశజూపడంతో పాటు... బెదిరింపులకు దిగాడని కార్తీక్ అనే వ్యక్తి ఆరోపించాడు. వీటిని రాజ్ తరుణ్ మేనేజర్ రాజారవీంద్ర ఖండించారు. రాజ్ తరుణ్ దృశ్యాలను మీడియాకు విడుదల చేస్తానని 5లక్షలు డిమాండ్ చేశారని... 3లక్షలకు బేరం కూడా కుదుర్చుకున్నాడని రాజా రవీంద్ర మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కార్తీక్ పై ఫిర్యాదు కూడా చేశారు. ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో రాజ్ తరుణ్ చేసిన కారు ప్రమాద ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవీ చూడండి: ఆ ప్రమాదానికి కారణం నేనే...: రాజ్తరుణ్