పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లాలోని బిజినాపల్లి, తిమ్మాజిపేట మండలాల్లో జరుగుతున్న పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు గత ఆరు రోజులుగా పనులు జరుగుతున్న చోట ధర్నా చేపడుతున్నారు. ఈరోజు జిల్లా పరిపాలనా కార్యాలయాన్ని ముట్టడించి తమకు న్యాయం చేయాలంటూ సంయుక్త పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ముట్టడి సమయంలో పోలీసులకు, భూనిర్వాసితులకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వివాదం చోటుచేసుకుంది. మల్లన్నసాగర్లో రైతులకు నష్టపరిహారం చెల్లించిన విధంగానే తమకూ నష్టపరిహారం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని డిమాండ్ చేశారు. అనంతరం భూనిర్వాసితులు స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడే బైటాయించి భోజనాలు చేసి నిరసన తెలిపారు.
ఇవీ చూడండి: పోలీస్ బైక్పై కుటుంబసభ్యుల షికార్లు..!